గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలు
శ్రీరంగవరం గ్రామంలో ఘటన.. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో సహాయక చర్యలు
మేడ్చల్, ఆగస్టు 3:
గ్యాస్ సిలిండర్ మారుస్తున్న సమయంలో జరిగిన పేలుడు ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు.
బాధితుడు చింతల శ్రీనివాస్ (37) ఇంట్లో గ్యాస్ సిలిండర్ మార్చే క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు కుమార్తెలు ప్రవళిక (14), హరిప్రియ (10), కుమారుడు విక్రాంత్ (6) గాయపడ్డారు. పేలుడు శబ్దానికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి సహాయక చర్యలు ప్రారంభించారు.
వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించగా, మేడ్చల్ 108 సిబ్బంది ఈఎంటీ సీతారాం, పైలట్ బాలకృష్ణ అత్యవసరంగా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈఆర్సీపీ డా. చక్రవర్తి సూచనల మేరకు గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి, తదుపరి చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు.
సమయానికి స్పందించిన 108 అత్యవసర సేవల సిబ్బంది వల్ల బాధితులకు తక్షణ వైద్యం అందిందని స్థానికులు తెలిపారు. ఈఎంటీ సీతారాం, పైలట్ బాలకృష్ణ సేవలను గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.






