మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం, మంత్రుల పీఏనంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా శివంపేటకు చెందిన సంతోష్ గుప్తా అనే వ్యక్తి ఎన్నో ఏళ్లుగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర, మేడ్చల్ ప్రాంతాల్లో తన ప్రభావాన్ని చూపిస్తూ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుడినంటూ చలామణి అవుతూ భూ వివాదాలు, సెటిల్మెంట్లలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. గతంలో పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ వివాదంలో సీఐ సస్పెన్షన్ అంశంలోనూ అతని పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
స్కూల్స్, బార్లు, రియల్ ఎస్టేట్ కార్యాలయాలు, వెంచర్ నిర్వాహకులపై ఆర్టీఐలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారులను “నేను సీఎం మనిషిని, మంత్రులు నా మాట వింటారు” అంటూ మోసం చేయడంలో సంతోష్ గుప్తా దిట్టగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా మేడ్చల్ పరిధిలోని మునిరాబాద్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఫోన్ ద్వారా బెదిరించి, భూమి సమస్య పేరుతో కలవాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో నిఘా పెట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు.
ఉప్పల సంతోష్ గుప్తా చేత మోసపోయిన లేదా బెదిరింపులకు గురైన బాధితులు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.
