నిజామాబాద్: అప్పు తీర్చేందుకు ఓ వ్యక్తి వినూత్నంగా మోసానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. కంకర రాళ్లకు బంగారం రంగు పూత పూసి వాటిని విలువైన బంగారు రాళ్లుగా నమ్మించి డబ్బులు కాజేసిన ఘటన డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీకి చెందిన రమేష్కు శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో రూ.1.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. చాలాకాలంగా అప్పు చెల్లించకపోవడంతో రమేష్ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.
దీంతో శ్రీనివాస్ తనకు గుప్తనిధి దొరికిందని, అందులో లభించిన బంగారు రాళ్లను అప్పుకు బదులుగా ఇస్తానని రమేష్ను నమ్మించాడు. వాటిని తీసుకురావాలంటే డిచ్పల్లి మండలం ఘన్పూర్కు రావాలని, అదనంగా రూ.32 వేల నగదు తీసుకురావాలని చెప్పాడు.
శ్రీనివాస్ మాటలు నమ్మిన రమేష్ అతడు సూచించిన ప్రదేశానికి వెళ్లి రూ.32 వేలు ఇచ్చాడు. అనంతరం నాలుగు బంగారు రాళ్లుగా చెప్పిన వస్తువులను అందుకున్నాడు. అయితే వాటిని పరిశీలించగా అవి అసలు బంగారం కాదని, సాధారణ కంకర రాళ్లపై బంగారం రంగు పూత మాత్రమే పూసినట్లు గుర్తించాడు.
మోసపోయానని గ్రహించిన రమేష్ వెంటనే డిచ్పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రజలు గుప్తనిధులు, బంగారం పేరుతో జరిగే మోసాలను నమ్మవద్దని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.





