ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడం, నేరాలకు పాల్పడటం కోసం నకిలీ నెంబర్ ప్లేట్లతో వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆదేశాలతో నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టిన పోలీసులు, వారం రోజుల్లోనే ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
టప్పాచబుత్రా, ఐఎస్ సదన్, తోలిచౌకి, అబిడ్స్, మలక్పేట ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో నకిలీ లేదా నిబంధనలకు విరుద్ధమైన నెంబర్ ప్లేట్లు ఉపయోగిస్తున్న వాహనాలను గుర్తించారు. ఈ కేసుల్లో సంబంధిత వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
వాహనదారులు ప్రభుత్వం ఆమోదించిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు, అంటే హెచ్ఎస్ఆర్పీ ప్లేట్లను మాత్రమే వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. నెంబర్ ప్లేట్లపై ఫాంట్లు మార్చడం, అంకెలు స్పష్టంగా కనిపించకుండా చేయడం, డిజైన్లు వేయడం, స్టిక్కర్లు అతికించడం లేదా ఇతర అనధికారిక మార్పులు చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.
నకిలీ నెంబర్ ప్లేట్లు లేదా మార్పులు చేసిన ప్లేట్లతో వాహనాలు నడిపేవారిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
రోడ్డు భద్రతను పెంచడం, నేరాలకు అడ్డుకట్ట వేయడం, వాహనాల గుర్తింపును సులభతరం చేయడం కోసం నగరవ్యాప్తంగా ఈ ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.



