హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా హెచ్ఎండీఏ (HMDA), జీహెచ్ఎంసీ (GHMC)లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పట్టణాభివృద్ధి, మున్సిపల్ పరిపాలనకు సంబంధించిన రెండు కీలక పోస్టుల్లో అధికారుల బాధ్యతలు మారడం పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా పనిచేస్తున్న వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేశారు.
అదే సమయంలో, జీహెచ్ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్తో పాటు అదనపు కమిషనర్ (ఎన్నికల విభాగం)గా బాధ్యతలు నిర్వహిస్తున్న కే. చంద్రకళకు హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (కోర్ అర్బన్ రీజియన్, ల్యాండ్ పూలింగ్, మెట్రోరైల్) పోస్టును పూర్తి అదనపు బాధ్యతలతో అప్పగించారు.
చంద్రకళ బదిలీపై చర్చ
ప్రస్తుతం కీలక పరిపాలనా ప్రక్రియల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రకళను హెచ్ఎండీఏకు అదనపు బాధ్యతలతో నియమించడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఆమె ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలకు కొత్త అధికారిని వెంటనే నియమించకపోవడం అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఈ తాజా బదిలీలతో పట్టణాభివృద్ధి, మున్సిపల్ పరిపాలనలో కీలక బాధ్యతలను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించినట్లు తెలుస్తోంది.






